వెబ్ సిరీస్లపై ఆదరణ పెరుగుతుండడంతో ఓవైపు సినీతారలు, మరో వైపు దర్శకులు కూడా వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు, బడా స్టార్లు వెబ్ సిరీస్ల బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో దర్శకుడు వచ్చి చేరారు. ఆయనే వేగేశ్న సతీష్. ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచి వాడవురా’ వంటి వరుస విజయాలను అందుకున్న వేగేశ్న తాజాగా ఓ వెబ్ సిరీస్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు కుటుంబ కథలతో కూడిన సినిమాలను తెరకెక్కించిన సతీష్ వెబ్ సిరీస్లో మాత్రం విభిన్న పంథాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ను ఇన్వేస్టిగేటివ్ క్రైమ్ డ్రామా కథతో ప్రేక్షకులను ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ నేపథ్యంలో ఉండనుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.