కరోనా మహమ్మారి రెండో సారి తిరగబడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. అన్నీ ఓపెన్ చేసేస్తున్నారని మండిపడ్డారు.
ప్రపంచంలో కరోనా మహమ్మారి మళ్లీ రెండో సారి వ్యాపిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో రెండో రౌండ్ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో కూడా చాలా చోట్ల కరోనా రెండో సారి కేసులు నమోదవుతున్నాయి. దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశంలో జనాభా ఎక్కువ ఉండటం వల్ల కేసుల తీవ్రత అధికంగా ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెండో సారి కరోనా సోకిన వారిలో తీవ్ర సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
జపాన్, వియత్నాం, దక్షిణ కొరియాలో సమర్థవంతంగా కరోనాను నియంత్రించారని చంద్రబాబు చెప్పారు. కాగా ఏపీలో ప్రభుత్వం కరోనా విషయంలో ప్రజలను పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశ ప్రధాని చెబుతున్నా రాష్ట్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కూల్స్, మద్యం ఓపెన్ చేయడం కరెక్టు కాదన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని ఓపెన్ చేయాలన్న ఉత్సాహమే కనబరుస్తోందన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా నియంత్రణ చర్యలు పక్కాగా చేపడుతున్నట్లు చెబుతోంది. ఏపీలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉందని చెబుతోంది. సీఎం జగన్ కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన దీనిపై ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చారు.