కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బయట ఉన్న పబ్లిక్తో పాటు జైళ్లల్లో ఉన్న ఖైదీలు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వేల మంది ఖైదీలను కరోనా కారణంగా బయటకు పంపుతున్నారు.
మహారాష్ట్రలోలో కరోనా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా 16,17, 658 మందికి కరోనా సోకిందని మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలతో పాటు ఖైదీలకు కూడా కరోనా సోకుతోంది. దీంతో ఇప్పటికే చాలా చోట్ల వైద్యులతో వైద్యం అందించారు. ఇక చివరగా వీరిని బయటకు పంపించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని పలు జైళ్లలో 2,340 మంది ఖైదీలు, 519 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,194 మంది ఖైదీలు, 495 మంది జైలు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆరుగురు ఖైదీలు, మరో ఆరుగురు జైలు ఉద్యోగులు కరోనాతో మరణించారు.
మహారాష్ట్ర జైళ్లలో 23,217 మంది ఖైదీలు ఉంచేలా జైళ్లు ఉండగా, కెపాసిటీ కంటే అధికంగా 27,756 మంది ఖైదీలున్నారు. కరోనా మహమ్మారి వల్ల జైళ్లలో పలువురు ఖైదీలను అత్యవసర పెరోల్, బెయిలుపై విడుదల చేశారు. మహారాష్ట్ర జైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పలు జైళ్లలో ఉన్న 10,668 మంది ఖైదీలకు అత్యవసర పెరోల్, బెయిలు మంజూరు చేశారు. మహారాష్ట్ర జైళ్లలో ఖైదీలు, సిబ్బందికి కరోనా సోకడంతో హైపవర్ కమిటీ సిఫార్సుల మేర ప్రభుత్వం ఖైదీలకు అత్యవసర పెరోల్, బెయిలు మంజూరు చేసింది.