ఇండియాకు గుడ్న్యూస్ వచ్చేసినట్లు అనిపిస్తోంది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా రికవరీల్లో కూడా ఇండియానే మంచి స్థాయిలో ఉంది. ఇన్ని రోజులు కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్న ఢిల్లీలో కూడా పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి.
దేశంలో సెప్టెంబరు నుంచి కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 91.78 లక్షల మంది కరోనా బాధితులు ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. కోవిడ్-19తో మృతి చెందినవారి సంఖ్య 1.45 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల విషయానికొస్తే 4 లక్షలకు దిగువన ఉంది. ఢిల్లీలో గత మూడు రోజులుగా కరోనా రికవరీ రేటు 94 శాతానికిపైగా నమోదవుతూ వస్తోంది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 57 మంది మృతి చెందారు. కొత్తగా 3,188 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 22,310గా ఉంది. కాగా పంజాబ్లో కోవిడ్-19తో మృతి చెందినవారి సంఖ్య 4,964కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,331కి చేరుకుంది. అలాగే హరియాణాలో కరోనా మృతుల సంఖ్య 2,624కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 2,46,679 మంది కరోనా బారినపడ్డారు.