ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ పోలీసుల ఎదుటే మృతిచెందారు. ఇందుకు కారణం బుల్లెట్ మిస్ ఫైర్ కావడమే.
వివరాల్లోకి వెళితే కర్నూల్లోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో డీఐజీకి గౌరవ వందనం సమర్పించే కార్యక్రమం జరుగుతోంది. కానిస్టేబుళ్లు డీఐజీకి గౌరవ వందనం ఇస్తున్నారు. ఈ క్రమంలో సాల్మాన్ రాజు అనే కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ అతని కడుపులోకి దూసుకెళ్లి బయటకు వచ్చేసింది. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు ఆయన్ను హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు.
ఈ లోపే కానిస్టేబుల్ సాల్మాన్ రాజు మృతి చెందారు. దీంతో బెటాలియన్ మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరవ వందనం సమర్పించే క్రమంలో కానిస్టేబుల్ మృతిచెందడం పట్ల పోలీసు అధికారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలపై అందరికీ అనుభవం ఉంటుంది. ముందుగానే వీటిని సాధన చేస్తారు. అయినప్పటికీ ఇలా జరగడం బాధాకరం.