ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈ సారి పూర్తి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని ఎంపికలో తమ పాత్ర ఏమీ ఉండదని కేంద్రం చెప్పేసింది. దీంతో ఇన్నాళ్లూ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పిన వారకంతా షాక్ తగిలినట్లైంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు పలువురు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాజధానిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా ఇప్పటికీ అమరావతిలో రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపిక విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా నేడు మరోసారి కేంద్ర హోంశాఖ మూడు రాజధానులపై హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఏముందంటే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో లేదని పేర్కొంది. మూడు రాజధానులు ఉండటం తప్పులేదని చెప్పింది. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఇక కేంద్రం తరుపున ఫుల్ క్లారిటీ వచ్చినట్లే. మరి ప్రతిపక్షాలు, మూడు రాజధానుల విషయంలో ఆందోళన చేస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.