ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవ్వరిని అడిగినా చెబుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. దాదాపుగా ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే పలువురు నేతలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.
2014, 2019లో టిడిపి, వైసీపీ అధికారం చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.17 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిన విద్యుత్ బోర్లకు కరెంటు మీటర్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీటర్లను తీసివేస్తామని ఆ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇది విన్న వారంతా ఏం మాట్లాడాలో తెలియడం లేదంటున్నారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో వైసీపీ అధికారం చేపట్టగా.. మరో బలమైన పార్టీ టిడిపి ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలా చేస్తాం ఇలా చేస్తామని అంటుంటే పొలిటికల్ సర్కిల్లో వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం 2024లో అయినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉంటే చాలని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలతో పాటు మెరుగైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవసాయ బోర్లకు పంపుసెట్లను బిగించాలని నిర్ణయించింది. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలోనే తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.