ఏపీలో అంతర్వేది ఘటన హాట్ టాపిక్గా మారింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం దగ్దమైన విషయంపై ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు, స్వామీజీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎంతో చరిత్ర కలిగిన అంతర్వేది ఆలయంలోని రథం దగ్దం అవ్వడం అనుమానాలకు తావిస్తోందని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే డిమాండ్ చేశారు. మొన్న అంతర్వేది ఘటనను పరిశీలించేందుకు వచ్చిన ముగ్గురు మంత్రులను హిందూ సంఘాలు సైతం అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తాజాగా అంతర్వేది ఘటనపై సీబీఐలో విచారణ జరపాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. అక్కడ దగ్దమైంది కేవలం స్వామివారి రథం కాదని ఐదుకోట్ల ప్రజల మనోరథాలని అన్నారు. దేవాలయాలను పరిరక్షించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 15 నెలలుగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని శ్రీనివాసానంద సరస్వతి స్వామి విమర్శించారు.
వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అంతర్వేదిలో రథాన్ని పిచ్చోడు తగలబెట్టారంటారా అని ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు, భూములను విజయసాయి రెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొండపై ఉన్న గ్రావెల్ను అమ్మేశారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.