తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే తప్పు చేస్తే ఎలా. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య పలు చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తమను వేధిస్తున్నారంటూ బహిరంగంగా చెబుతున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇటీవల రాజస్థాన్లో చోటుచేసుకున్న ఓ ఘటన పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తోంది.
ఓ వివాహితను ఒంటరిగా తన ఇంటికి రమ్మని పిలిచిన ఓ పోలీసు ఇన్స్పెక్టరును సస్పెండ్ చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లా సీనియర్ పోలీసుఅధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జశ్వంతపుర పట్ణణంలో ఓ వివాహిత తన పిల్లలతో కలిసి మార్కెటులో కూరగాయలు కొంటుండగా పోలీసు ఇన్స్పెక్టరు సాబీర్ ముహమ్మద్ ఫోన్ చేసి తన గదికి ఒంటరిగా రమ్మని కోరాడు. మహిళ కడుతున్న ఇంటికి తాను ఇసుకలారీ పంపించానని, అది చేరిందా అని పోలీసు ఇన్స్పెక్టరు వివాహితను ప్రశ్నించాడు.
మధ్యాహ్నం కాని సాయంత్రం కాని ఐదు నిమిషాల కోసం తన గదికి ఒంటరిగా రావాలని పోలీసు ఇన్స్పెక్టరు వివాహితను ఫోనులో కోరాడు. దానికి వివాహిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఇన్స్పెక్టరు సాబీర్ ముహమ్మద్ సస్పెండ్ చేసి, శాఖ పరమైన దర్యాప్తునకు ఆదేశించామని సీనియర్ పోలీసు అధికారి శ్యాంసింగ్ చెప్పారు. ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనల వల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోంది. అయితే ఒక్కరు చేసిన దానికి శాఖను మొత్తాన్ని నిందించడం తగదని పలువురు అంటున్నారు.