ఆంధ్రప్రదేశ్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు.
వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సమావేశంలో చర్చించారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరగాలన్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని.. రోడ్ల, కాల్వలు, చెరువులకు మరమ్మత్తుల పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రకాశం బ్యారేఈకి వరద వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపి.. ఆ తర్వాత కాల్వల ద్వారా ప్రతి చెరువుకు నీళ్లు అందించడం చేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో అధిక వర్షం కురిసినా కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నింపారని.. అన్నింటినీ నింపాలన్నారు. ఇక వర్షాల కారణంగా త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా మంచి నీరు సరఫరా చేయాలని చెప్పారు.