భారీ వరదల కారణంగా ఆందోళన చెందుతున్న ప్రజలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని.. ఖర్చుకు వెనకాడొద్దని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
వరద పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చెప్పారు. మంచి భోజనం అందించాలన్నారు. గోదావరి వరద ఉదృతి కారణంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులందరూ తక్షణ సహాయ చర్యలు వేగంగా చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద పరిస్థితి, పునరావాస చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన చెప్పారు.
ఇక దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయని, 13 మండలాల్లో వరద ప్రభావం ఉందని, 161 గ్రామాలలో ముంపు పరిస్థితి ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వివరించారు. అలాగే దిగువన అమలాపురంలో మరో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుందనే అంచనాతో అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకూ 63 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామనని అధికారులు తెలిపారు.