ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలుగురాష్ట్రాలలో వర్షాలు కొన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీ తెలంగాణాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే ఎంతో మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు పునరావాస చర్యల్లో వేగంగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు మరి కొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఏపీ, తెలంగాణల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురు మొదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందన్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపారు. కాగా ఈనెల 19వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న విషయం తెలిసిందే.
ఏపీలో సీఎం వై.ఎస్ జగన్ వరద, పునరావాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావర ఉగ్రరూపం దాల్చుతోంది. ఎన్నడూలేనంతగా ఇప్పుడు గోదావరి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. వర్షం ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కొనసాగుతాయన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.