ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్పై ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆయన కంపెనీలకు సంబంధించిన కేసుల్లో ఆయనపై సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు వై.ఎస్ జగన్ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తనపై కక్ష్య గట్టి ఇలా చేస్తోందని ఆయన మండిపడ్డారు. తనను అరెస్టు చేయించడమే వై.ఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ అంటున్నారు. నన్ను అరెస్టు చేయించే వరకు జగన్ అన్నం కూడా తినరని తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతోందని ఆయన అన్నారు. తనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించడంలో విజయవంతం అయ్యారన్నారు.
ఇక ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఇక న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయన్నారు. పరిస్థితులు ఆర్టికల్ 356 దిశగా ప్రయాణం చేసేలా ఉన్నాయన్నారు. ఇటీవల రఘురామకృష్ణం రాజుపై సీబీఐ దాడులు చేసింది. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న రోజే ఆయనపై సీబీఐ అధికారులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. పార్టీ పరంగా తనను ఏమీ చేయలేక జగన్ ఇలా చేస్తున్నారని ఇది వరకే ఈయన మండిపడ్డారు. కాగా నేడు మరోసారి ఆయన జగన్పై ఈ వ్యాఖ్యలు చేశారు.