ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట రాజకీయ నాయకులకు కరోనా సోకుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా సోకింది.
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ఎంపీలంతా ఇప్పటికే పార్లమెంటు చేరుకున్నారు. కాగా పార్లమెంటు మంత్రిత్వ శాఖ ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తేల్చి చెప్పింది. నెగిటివ్ ఉంటేనే పార్లమెంటులో అడుగు పెట్టాలని స్పష్టం చేసింది. కాగా పార్లమెంటులో కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల కోసం ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన ఇద్దరు ఎంపీలకు కరోనా సోకింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా సోకింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. ఈయనతో పాటు అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే మాధవి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. పార్లమెంటు హాలులో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని రావడంతో ఈ ఎంపీలు ఇద్దరికీ 14 రోజుల పాటు వైద్య పరీక్షలు అందించనున్నారు. కాగా పార్లమెంటు సమావేశాలకు వచ్చిన 24 మంది ఎంపీలకు కరోనా సోకింది. మరో 8 మంది కేంద్ర మంత్రులకు కూడా కరోనా సోకిందని తెలుస్తోంది.