భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చైనా అరాచకాలకు పాల్పడేందుకు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. చైనా భారతదేశంలోని ప్రముఖులపై గూఢచర్యంకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ వార్త పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమైన కథనం ఆందోళన కలిగిస్తోంది.
చైనా వస్తువులు, యాప్లపై మోదీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో చైనా భారత ప్రముఖులపై గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన షెన్జేన్ సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సరిహద్దులో సైనిక కార్యకలాపాలతో పాటు దేశ రహస్యాలను చేరవేసేందుకు కుట్రలు పన్నినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమైంది.
చైనా నిఘా పెట్టిన వారిలో ప్రముఖంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ బాబ్డే, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులు, మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్తో పాటు 10 వేల మంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖుల రహస్యాలతో పాటు దేశ రక్షణకు సంబంధించిన వాటిపై నిఘా పెట్టిందన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. కాగా ఈ విషయంపై ఇంకా చైనా స్పందించలేదు.