మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన చిరు.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. ఇంట్లో గడిపిన క్షణాలను షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చిరు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలతో పాటు ఒక అందమైన కవితను కూడా పోస్ట్ చేశాడు. ఇంట్లో పూలకుండీలోని వికసించిన మందార పువ్వు ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది.. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది’ అని తనదైన శైలిలో కవితను రాసుకొచ్చారు చిరు. ఇక గత కొన్ని రోజుల క్రితం కూడా ఇంటి ఆవరణలో చెట్లకు నీళ్లు పడుతున్న వీడియోను చిరు షేర్ చేసిన విషయం తెలిసిందే. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంతో పాటు మరో రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్న విషయం తెలిసిందే.