ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరహాలోనే ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆయన సైలెంట్ అయ్యారు.
చంద్రబాబు ఏదైనా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పార్టీ నేతలు దీన్ని అమలు చేస్తారంటే ఇదేనేమో. నిన్నంతా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల రాజీనామాల అంశంపై మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని చెప్పారు. అయితే నేడు ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు బలంగా మాట్లాడాలని బాబు చెప్పినట్లు ఉన్నారు.
అందుకే నేడు ఆ పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్యలు స్టాట్ చేశారు. సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంటే చంద్రబాబు విసిరిన సవాల్ను స్వీకరించాలన్నారు. రాజధానిగా అమరావతి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. చంద్రబాబు సవాల్ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు లాగే పార్టీ నేతలు కూడా వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. అఖండ మెజార్టీతో గెలిచిన జగన్ను రాజీనామా చెయ్యాలని చెప్పడం కంటే టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచి చూపిస్తే బాగుంటుంది కదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.