ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ఫ్యాక్టరీలను పరిశీలించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల విశాఖలోని ఎల్.జి పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన విషయం మనకు తెలిసిందే. ఇలాంటి ఘనటలు మళ్లీ పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పరిశ్రమల్లో సురక్షిత వాతవరణం కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమలను తనిఖీ చేసేందుకు కమిటీలు వేయాలని పేర్కొంది.
జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పరిశ్రమలను పరిశీలించాల్సి ఉంటుంది. వీటిలో ఏమైనా లోపాలుంటే నెల రోజులలోపు సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీని ద్వారా పరిశ్రమల్లో ఏమైనా సమస్యలు ఉంటే బయటపడటంతో పాటు సరిచేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. తమ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఉన్న ప్రజలు ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువులు ఉన్న పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్థాలు, రెడ్ కేటగిరి పరిశ్రమలు ఇలా అన్నింటిని తనిఖీ చేయాలని ప్రభుత్వం తెలిపింది.