భారత్కు పాకిస్తాన్ శత్రువు.. భారత్కు చైనా కూడా శత్రువుగానే మారుతోంది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్లు చైనా, పాకిస్తాన్ స్నేహం ఇప్పుడు బాగా బలపడుతోంది. దీంతో చైనా భారత్ను డైరెక్టుగా ఎదుర్కొనలేక పాకిస్తాన్కు అవసరమైన సహాయం చేస్తోంది.
చైనా పాకిస్తాన్కు అత్యాధునికమైన ఆయుధాలను విక్రయిస్తోంది. తాజాగా 50 సాయుధ డ్రోన్లను విక్రయించినట్లు తెలుస్తోంది. చైనా అభివృద్ధి చేసిన వింగ్ లూంగ్-2 డ్రోన్లు పూర్తి సాయుధ టెక్నాలజీతో పనిచేస్తాయి. పూర్తి స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్లి నిర్దిష్ట ప్రాంతంలో జారవిడిచే శక్తి వీటికుంటుంది. ఇవి కనుక పాక్ చేతికి చిక్కితే భారత్కు తిప్పలు తప్పవని, పర్వతాల్లో మొమరించిన భారత మిలటరీ ఈ డ్రోన్లను ఎదుర్కోలేదని, వీటి ముందు భారత్ సంప్రదాయ యుద్ధం ఎందుకూ పనికిరాదని చైనా పత్రికలు చెబుతున్నాయి.
లిబియా, సిరియా, అజర్బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ యుద్ధాన్ని నమ్ముకున్న ప్రత్యర్థులను ఈ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయని, శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని పేర్కొన్నాయి. ఇలాంటి డ్రోన్లు చైనా, టర్కీ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు పాక్ కూడా అందించేందుకు చైనా సిద్ధమైందని రాసుకొచ్చాయి. అయితే భారత్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. అసలు చైనా డ్రోన్లు పనిచేస్తాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని ఎగతాళి చేసింది. తమకు పట్టున్న ప్రాతంలో మాత్రమే డ్రోన్లతో దాడి చేయగలమని, అంతేకానీ ఎక్కడికైనా వెళ్లి దాడి చేయడం సాధ్యం కాదని చెప్పింది. దీనికి ఆఫ్ఘన్ గగనతలంపై పట్టు ఉండడం వల్లే అమెరికా ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై దాడులు చేయగలుగుతుందని గుర్తు చేసింది.