భారత్ ధాటికి చైనా దిగొచ్చిందని చెప్పాలి. ఇండియా, చైనా మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
పొరపాటున చైనా సరిహద్దులోకి వెళ్లిన ఐదుగురు భారతీయులను చైనా అపహరించిన విషయం తెలిసిందే. అయితే తామెవ్వరినీ తీసుకెళ్లలేదని తమ దగ్గర ఎవ్వరూ లేరని చైనా ప్రకటించింది. మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకొని భారతీయులు తమ వద్దనే ఉన్నారని తెలిపింది. నేడు ఆ ఐదుగురుని విడుదల చేసింది. ఈనెల 1వ తేదీన అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వేటగాళ్లు మెక్ మోహన్ రేఖ దాటి వెళ్లారు. వీరిని తిరిగి అప్పగించినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి.
అరుణాచల్ ప్రదేశ్లోని సుబర్సిన్ జిల్లా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి చెందిన వీరిని చైనా భద్రతా దళం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరించింది. అయితే చైనాకు చెందిన వారు సరిహద్దు దాటి వస్తే భారత బళాలు వారిని సురక్షితంగా వారి ప్రాంతాలకు పంపిస్తాయి. అయితే చైనా మాత్రం తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉంది. ఇక నిన్న జరిగిన ఇరు దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడేలా వ్యవహరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో భారత పౌరులను విడిచిపెట్టారన్న వాదన ఉంది.