ఆంధ్రప్రదేశ్లో ఆలయాల భద్రతపై సర్కార్ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోనుంది. మొన్న అంతర్వేది ఘటనతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలయాల్లో ఇలాంటి దుశ్చర్యలకు ఎవ్వరు పాల్పడుతున్నారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో మిగతా ఆలయాలపై ఫోకస్ ఉండనుంది.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలోని రథం దగ్దం అవ్వడం ఏపీలో సంచలనం సృష్టించింది. రాజకీయ ఆరోపణలకు కేంద్రంగా ఈ ఘటన మారిందని చెప్పొచ్చు. దీంతో ఎట్టకేలకు ఈ కేసును విచారణను సీబీఐకి అప్పగిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఇలాంటి పరిస్థితే మరోసారి జరగకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అవసరమైన చోట సీసీ కెమెరాలు, పోలీసులతో భద్రత చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న రథాన్ని, ఆలయ అనుబంధ ఆలయాలైన కుంకుళ్ళమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురం లోని జగన్నాథ స్వామి వారి రథాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. ఆలయాల్లో తీసుకుంటున్న భద్రతపై పోలీసులు చర్చించారు. అంతర్వేది ఘటన తో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల పై పోలీసులు దృష్టి సారించారని చెప్పొచ్చు. ఇక భీమవరం లోని సోమేశ్వర జనార్ధన స్వామి రథం, ఆచంట లోని ఆచంటేశ్వర స్వామి రథం, అత్తిలి మదన గోపాల స్వామి రథంతోపాటు ముఖ్యమైన ఆలయాల్లోని రథాలపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యమైన ఆలయాల వద్ద హోంగార్డులు విధులు నిర్వర్తిస్తుండగా చాలా ఆలయాల వద్ద ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారు.