సీబీఐని రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీబీఐ విచారణలు అడుగుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు భయపడినట్లు సీబీఐకి తామేమీ భయపడమని బొత్స అన్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా విచారణలు జరపలేదని గుర్తు చేశారు. రాజకీయాలతో దేవుడిని ముడి పెట్టడం మంచిది కాదని బొత్స అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన చంద్రబాబుకు ఒకరి తర్వాత ఒకరు గుర్తుకొస్తున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని బొత్స అన్నారు.
వైఎస్సార్ ఆసరా ద్వారా 90 లక్షల మందికి లబ్ది చేకూరిందన్నారు. రాష్ట్రంలో బాధ్యత గల ప్రభుత్వంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు దుష్ట ఆలోచనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. పుష్కరాల పేరుతో 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారన్నారు. పుష్కరాల సందర్భంగా భక్తుల మరణానికి చంద్రబాబు కారణమయ్యారని చెప్పారు. దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు చౌకబారు మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.