భారత్ పై చైనా మండిపడింది. సరిహద్దుల్లో భారత సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని పేర్కొంది. సరిహద్దుల్లో కవ్వింపుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
జూన్ 14 అర్ధరాత్రి డ్రాగన్ ఆర్మీ గల్వాన్ లోయలో ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో భారత ఆర్మీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ దాడుల్లో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు మృతి చెందారు.
ఈ విషయంపై భారత్లో చైనా రాయబారి సన్ వెడాంగ్ చైనీస్ ఎంబసీ మ్యాగజీన్లో తన అభిప్రాయాన్నిప్రచురించారని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఇందులో ఏముందంటే గల్వాన్ లోయలో ఘర్షణలు జరగడానికి కారణం భారత ఆర్మీ చర్యలే అని చెప్పారు. అందుకే ఇలాంటివి మరోసారి జరగకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు.
భారత దళాలు తమను రెచ్చగొట్టాయని చైనా పేర్కొంటోంది. వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వచ్చి చైనా బలగాలపై దాడులు చేశాయి. భారత్, చైనా దేశాల ఒప్పందాన్ని భారత బలగాలే ఉల్లంఘించాయని చైనా అంటోంది. దీనిపై విచారణ జరిపి చట్టాలు అతిక్రమించిన బలగాలపై ఇండియన్ గవర్నమెంట్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది. అంతేగాక వారు రెచ్చగొట్టే చర్యలు ఆపినపుడే మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని సన్ వెడాంగ్ తన ఆర్టికల్లో వ్యాఖ్యలు చేశారు.
దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పలుమార్లు దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సన్ వెడాంగ్ ఈ మేరకు తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.