భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. చైనా వ్యవహారశైలి చూస్తుంటే ఏమైనా జరగొచ్చన్న ఆందోళన వ్యక్త మవుతోంది. అయితే భారత్ మాత్రం సంప్రదింపులు జరుపుతూనే అవసరమైతే దేనికైనా రెడీ అన్నట్లుగా సిద్ధంగా ఉంది.
సరిహద్దులో చైనా సైన్యం రెచ్చిపోతుందని భారత్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. తూర్పు లద్దాక్ సమీపంలో కాల్పులు జరిగాయన్న సమాచారంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. అయితే దీనిపై స్పందించిన భారత సైన్యం.. చైనా తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలిపింది. అందుకే గాలిలో కాల్పులు జరుపుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తోందని తెలిపింది.
అయితే చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము మాత్రం సంయమనంతోనే ఉంటున్నట్లు భారత సైన్యం తెలిపింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు సంప్రదింపులు, చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు భారత్ ప్రకటించింది. మరి చైనా మాత్రం చర్చలు జరుపుతామని చెబుతూనే ఆక్రమణలకు పాల్పడుతోంది. కాగా చైనాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత సైన్యం ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటుందని ఇదివరకే సైన్యాధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.