రాష్ట్రంలో వైసీపీ నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో వీడియో గేమ్లు ఆడుకోవాలని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని నాశనం చేయొద్దన్నారు. భవనాలకు అద్దెలు కట్టలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా అని ఆయన ప్రశ్నించారు.
క్రికెట్లో సింగిల్ రన్ తీయలేని వ్యక్తి సెంచరీ కొడతానని చెప్పినట్లు ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో వార్డు సచివాలయానికి అద్దె కట్టడం లేదని యజమాని ఉద్యోగులను బయటకు పంపి తాళాలు వేశారని అన్నారు. ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలను కోర్టులు అడ్డుకోకపోతే ఇప్పటికంతా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నిలువునా ముంచేసే వారన్నారు.
వై.ఎస్ జగన్కు హైదరాబాద్, బెంగుళూరు, తాడెపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నందుకే మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నా కనీసం సీఎం స్పందించ లేదన్నారు. ఇప్పటికైనా జగన్ మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.