ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంను.. అధికార టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడడం తెలిసిందే. ఇలాంటిదే.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జరిగితే మాత్రం.. టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేసేవాళ్లు. రోజాను ఆ మధ్య శాసనసభ నుంచి సస్పెండ్ చేసినట్టు.. తీవ్రమైన.. కఠినమైన.. చర్యలు తప్పకుండా తీసుకుని ఉండేవాళ్లు. కానీ.. ఇక్కడ ఇబ్బందుల్లో ఇరుక్కున్నది టీడీపీ నేతలు.
అందుకే.. అధినేత చంద్రబాబు నాయుడు.. తమ టాలెంట్ చూపించారు. సమస్యను పెద్దది కాకుండా.. చాకచక్యంగా పరిష్కరించుకున్నారు. ఉన్నతాధికారిని దూషించిన నేతలను అంతర్గతంగా బాగానే మందలించారు. అక్కడితో ఆగకుండా ఆ విషయాన్ని బయటికి ప్రచారం కూడా చేసుకున్నారు. డైరెక్ట్ గా వెళ్లి.. బాలసుబ్రమణ్యంను కలిసి క్షమాపణ చెప్పాలని కూడా ఆదేశించారు.
దీంతో.. వెంటనే బాబుగారి ఆదేశాన్ని తూ.చ. పాటించిన సదరు తెలుగుదేశం నేతలు బోండా ఉమ, కేశినేని నాని, బుద్ధా వెంకన్న.. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంను కలిసి.. తమ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. వివాదాన్ని అక్కడితో ముగించేశారు. ఇంకేముంది.. విషయం కూడా చల్లబడింది. క్షమాపణలు చెప్పారన్న కారణం చూపిస్తూ.. ప్రతిపక్ష నాయకులు కూడా తమను ప్రశ్నించకుండా చేసుకున్నారు. అందుకే.. బాబు గారి తెలివికి పార్టీ నేతలు మురిసిపోతున్నారట.