తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అంశం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం తేల్చి చెప్పినా చంద్రబాబు మాత్రం ఇంకా కేంద్రం చుట్టూనే తిరుగుతున్నారు.
ఇటీవల కేంద్ర హోంశాఖ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారమని క్లియర్గా చెప్పింది. నిన్న అదనపు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీంతో రాజధానిపై గవర్నమెంటు నిర్ణయమే ఫైనల్. కేంద్రం తన తరుపున చేయాల్సిన సహాయ, సహకారాలు మాత్రం అందజేస్తుందని అర్థమైంది. అయినప్పటికీ టిడిపి మాత్రం రాజధానిపై పార్లమెంటుకే అధికారమని మళ్లీ చెబుతోంది.
రాజధాని రైతుల త్యాగాలు గుర్తించి కేంద్రం అప్పట్లో కేపిటల్ గెయిన్స్ మినహాయింపులు ఇచ్చిందని టిడిపి అంటోంది. రాజధాని ఎంపికకు కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారాలు లేవనడం ఏంటని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారిస్తే రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటని అంటున్నారు. ఇక చంద్రబాబు వైఖరిపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతునా మళ్లీ ఇలా వ్యాఖ్యలు చేయడం కేవలం రాజకీయాల కోసమే అన్న భావన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి ఉందనుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి వైసీపీ కోరుకుంటోంది కదా అన్న వాదన ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఉండాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇక మూడు రాజధానులను అడ్డుకునే దారులు లేకనే ప్రతిపక్షాలు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నట్లు వైసీపీ కాంపౌండ్లో డిస్కషన్ నడుస్తోంది.