ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతి విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని ఉండగా.. ఆ స్థానంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
అమరావతి రైతులు ఏర్పాటుచేసిన జనభేరి సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం చెప్పాలన్నారు. లేదా జగన్రెడ్డికి దమ్ముంటే రెఫరెండానికి సిద్ధం కావాలన్నారు. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందామని, జగన్ గెలిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ చేశారు. తాను అధికారం కోసం పోరాడడం లేదని చంద్రబాబు అన్నారు. అధికారం తనకు కొత్త కాదని, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని,
ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడుతున్నామని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ముందుకెళ్తున్నామన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. ప్రభుత్వానికి మహిళల శాపం తగులుతుందన్నారు.