ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై మండిపడేందుకు రెడీగా ఉంటారు. మొన్నటి వరకు టిడిపి నేతలపై దాడుల విషయంతో పాటు వైసీపీ నేతల అవినీతిపై మాట్లాడిన టిడిపి ఇప్పుడు కొత్త అస్త్రం ఎంచుకుంది. వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడుతోంది.
వరద ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అంటున్నారు. ఏడాదిన్నరగా వరుస విపత్తులు వచ్చి పడుతున్నా ప్రభుత్వపరంగా ప్రజలకు పెద్దగాసాయం అందడం లేదన్నారు. వరుస విపత్తుల్లో రైతులు అందరికంటే ఎక్కువగా నష్టపోయారని, వారికి జరిగిన నష్టాన్ని భర్తీచేసేలా ప్రభుత్వం నుంచి సాయం లేదన్నారు. చేతివృత్తులవారు, ఇళ్ళు దెబ్బతిని పేదలు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శించారు. సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారన్నారు.
ఇక జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషం’’ అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా గత వారం రోజుల నుంచి వర్షాల పరిస్థితిని అంచనా వేస్తూ అన్ని జిల్లాల ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. సీఎం సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. వరదలు వస్తున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సరైన ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.