ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 15 సంస్థలు జాతీయ స్థాయిలో నియామక పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి నుంచి కేవలం ఒక్కటే నియామక పరీక్ష ఉండనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. మామూలుగా అయితే గవర్నమెంట్ జాబ్ కోసం చాలా పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం కేవలం ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుందన్నారు. ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఉమ్మడి పరీక్ష విధానం అమల్లోకి వచ్చేలా జాతీయ నియామక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో మైలు రాయి వంటిదని మంత్రి అన్నారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే యువతకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.