కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఓ వైపు కేంద్రం నుంచి చర్చలు జరుగుతున్నా రైతులు మాత్రం ఆందోళన వీడటం లేదు.
రైతులు చట్టాలను రద్దు చేయాలన్న పట్టుదలతో మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతు లభిస్తోంది. రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల వారు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా రైతులకు నిధులు బదిలీ అయ్యాయి.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వందశాతం ఇచ్చే సాయాన్ని వివిధ బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాల్లో శుక్రవారం జమ అయ్యాయి. ఈ మేర రైతుల మొబైల్ ఫోన్లకు శుక్రవారం 11 గంటలకు డబ్బు జమ అయినట్లు మెసేజులు వచ్చాయి. ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాని ఈ నిధులు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు 6వేల రూపాయలు సాయం అందే ఈ పథకం కింద మూడు వాయిదాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. సాగు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందింది. శుక్రవారం 9 కోట్ల మంది రైతులకు రూ.18,000కోట్లను బదిలీ చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు.