పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ఈయన వైసీపీ తరుపున ఎంపీగా గెలుపొందారు. అయితే కొద్ది రోజులుగా ఈయన వైసీపీని ధిక్కరించి ఆ పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో చర్చ లేపారు.
కాగా నేడు ఎంపీ రఘరామ ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృంధం ఆయన ఇంట్లో దాడులు చేస్తోంది. బ్యాంకుల రుణం తీసుకున్న రుణం ఎగ్గొట్టారన్న కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. ఇందూభారత్ కంపెనీలతో పాటు రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న 8 మంది ఇళ్లపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్, ఢిల్లీతో పాటు నరసాపురంలోని ఆయన ఇళ్లల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన 12 సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. గతంలో ఈయనపై నమోదైన కేసులకు సంబంధించి ఇప్పుడు ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆయనపై 2019లో కూడా సీబీఐ సోదాలు చేసింది. అప్పట్లో బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు సోదాలు చేశారు. అపుడు 3 గంటలకు పైగా సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ విషయాన్ని ఎంపీ రఘురామ అప్పట్లోనే చాలా సింపుల్గా తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పులు ఉన్నమాట వాస్తవమే కానీ వన్టైం సెటిల్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఆయన చెప్పారు. తన పవర్ ప్రాజెక్టు నష్టాల్లో ఉన్నందున రుణాలు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే ఇటీవల వైసీపి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు దగ్గరకు చేరాలన్న ఆలోచనలో రఘరామ ఉన్నట్లు పుకార్లు వినిపించారు. ఇందుకు ప్రధాన కారణం లా లో ఉన్న లొసుగులను ఉపయోగించి సీబీఐ కేసుల నుంచి చంద్రబాబు తనను తప్పిస్తారన్న ఉద్దేశంతోనే ఆయన చంద్రబాబుకు దగ్గరవ్వాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.