ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు అధికారం కోల్పోయాక కేసుల రూపంలో వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. వీరి జాబితాలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారి వరకు అందరూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసు ఇప్పుడు విచారణ జరుగుతోంది. అప్పట్లో లక్ష్మీ పార్వతి ఈ కేసు వేశారు. ఇన్నాళ్లూ స్టే తెచ్చుకున్న ఈ కేసులో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభం అయ్యింది. దీంతో ఈ కేసులో చంద్రబాబు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేసు వేసిన లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబుకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ న్యాయస్థానానికి అందజేసినట్లు చెప్పారు. దీంతో ఈ కేసు ఏమవుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇక టిడిపి అధికారంలో ఉండగా అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగన్ అధికారం చేపట్టిన తర్వాత అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో అప్పట్లో టిడిపికి చెందిన మంత్రులు, నేతలంతా ఈ కేసులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ.ఎస్.ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సైతం అరెస్టయిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు విషయంలో విచారణ జరిగి తీర్పు ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పుడు తాజాగా అనంతపురం టిడిపి నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కూడా కేసులో ఇరుక్కున్నారు. ఈయనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాష్ట్రంలో టిడిపి నేతలకు కేసుల చిక్కుముడులు పడ్డాయని అంతా అనుకుంటున్నారు. మరి ఈ కేసులన్నింటిలో న్యాయమైన దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ కేసుల వ్యవహారం టిడిపిని ఏ స్థాయికి తీసుకెళుతుందో వేచి చూడాలి.