కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు .ఈ ఘటన జరిగింది ఒడిశాలో. బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే ఉమాకంఠకు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఈయన హోం క్వారంటైన్లో ఉన్నారు. అయితే బీజేడీ సీనియర్ నేత ప్రదీప్ మహారాతి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు.
దీంతో ఎమ్మెల్యే ఉమాకంఠ ఈయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే కరోనా నేపథ్యంలో అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం బంధువులు మాత్రమే అదీ నిబంధనలు పాటించాలని చెప్పారు. నిబంధనలు పాటించకుండా కరోనా సోకిన ఎమ్మెల్యే అత్యక్రియల్లో పాల్గొనడంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 269, 270 అంటువ్యాధుల నియంత్రణ చట్టం వంటి సెక్షల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ అంత్యక్రియల్లో ఇద్దరు మంత్రులు కూడా పాల్గొన్నారు. వారికి కూడా కరోనా సోకిందని అంటున్నారు. అయితే ఈ సమాచారం మాత్రం పూర్తిగా బయటకు రాలేదు. కానీ పోలీసులు వీరి మీద మాత్రం కేసులు పెట్టలేదు. దీంతో దీనిపై కొందరు మండిపడుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. సామాన్య ప్రజలు నిబంధణలు అతిక్రమిస్తే చర్యలు తీసకోవాలని చెప్పే పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఇలా చేయడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరో ఎంపీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. బీజేపీకి చెందిన ఎంపీ అపరాజిత షడంగి రూల్స్ను అతిక్రమించి బర్త్ డే పార్టీ చేసుకుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈమెపై చర్యలు తీసుకోవాలని బిజూ జనతా దళ్ డిమాండ్ చేస్తోంది. ఏదేమైనా ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇలా రూల్స్ బ్రేక్ చేయడం మంచి పద్దతి కాదు.