అప్పులు ఎక్కువై సర్వం కోల్పోయిన వాళ్లను మనం చూసి ఉంటాం. కొందరు కష్టపడి అప్పులు తీరుస్తారు. మరి కొందరు అప్పులు ఎక్కువై చెల్లించలేక చేతులు ఎత్తేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అప్పులు తీర్చేందుకు కిడ్నీనే అమ్మాలనుకున్నాడు. అంతటితో ఆగకుండా ఏకంగా పేపర్లో యాడ్ కూడా ఇచ్చేశాడు.
కశ్మీర్లో ఓ వ్యాపారి అప్పులు తీర్చేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. కశ్మీర్లోని కుల్గమ్ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్(28) అనే వ్యక్తి కార్ డీలర్గా పనిచేసేవాడు. కరోనా కారణంగా తాను తీసుకున్న రూ. 91 లక్షల రుణాన్ని చెల్లించలేక అవస్థలు పడుతూ వచ్చాడని తెలుస్తోంది. రుణాన్ని ఏ విధంగా తీర్చాలో తెలియక ‘నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా’ అంటూ స్థానిక పేపర్లో యాడ్ ఇచ్చాడు. ‘వ్యాపారంలో నేను సర్వం కోల్పోయాను. నేను రూ. 90 లక్షల రుణా న్ని తీర్చాల్సి ఉంది. కాబట్టి నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా. కిడ్నీ అవసరం ఉన్న వారు నన్ను కాంటాక్ట్ చేయండి’ అంటూ సబ్జర్ పేపర్ యాడ్లో చెప్పుకొచ్చాడు.
కాగా.. కశ్మీర్లో కరోనా కారణంగానే కాకుండా ఆర్టికల్ 370 సమయంలోనూ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ కారణంగా కశ్మీర్లోని వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారని తెలుస్తోంది. కాగా కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంతో మంది వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇలా కిడ్నీలు అమ్ముకుంటామని ఎవ్వరూ యాడ్ ఇవ్వలేదు.