ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గ ప్రసాద్ రావు చనిపోయారు. కరోనా సోకిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు.
దీంతో తిరుపతిలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎంపీ చనిపోయారు కాబట్టి ఆ స్థానం ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే ఇటీవల బీజేపీ నేతల మాటలు వింటే పోటీ జరిగేలా కనిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో తిరుపతి లోక్సభకు ఉప ఎన్నికకు పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మామూలుగా అయితే ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ చనిపోయిన సందర్బంలో అక్కడ ఏకగ్రీవం అవుతూ వస్తోంది. గతంలో కూడా ఇలాగే జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో అయితే భూమా నాగిరెడ్డి వైసీపీ తరుపునే గెలిచి టిడిపిలోకి వెళ్లారు కాబట్టి జగన్ అప్పుడు పోటీలో పెట్టారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయలేదు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ చనిపోయినపుడు ఇక్కడ కూడా ఏ పార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచకూడదు. కానీ ఇక్కడ విభిన్నంగా పోటీ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల నాటిని ఏమైనా పరిణామాలు మారితే చెప్పలేం. అయితే ఏది ఏమైనా భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తార్న దాంట్లో ఎలాంటి సందేహమూ లేదని ప్రజలతో పాటు వైసీపీ భావిస్తోంది.