పశ్చిమబెంగాల్పై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని చూస్తోంది. అయితే అధికార పార్టీ కూడా బీజేపీకి మెజార్టీ రాకుండా చూడాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ వ్యూహకర్త పీకే బీజేపీ నేతలకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.
బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పర్యటనలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ పర్యటనలను మరింత ఎక్కువగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించిన కార్యచరణ అమలు అవ్వబోతోందని సమాచారం. ఫిబ్రవరి నుంచి నెలలో ఒక వారం చొప్పున రాష్ట్రంలో అమిత్షా పర్యటిస్తారని అంటున్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు ముందు పర్యటించడం వల్ల మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శాసన సభ ఎన్నికల వరకు ప్రతి నెల ఒక వారం పాటు అమిత్షా పర్యటిస్తారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో 294 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 200 స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాలు లభించడంతో ఆ పార్టీ మరింత ఉత్సాహంగా అధికార పార్టీతో పోరాడుతోంది.
బీజేపీకి పోటీ ఇచ్చిందేకు అధికార టీఎంసీ అన్నివిధాలా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ బీజేపీ నేతలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200 సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ నేతలు తమ పదవులకు స్వస్తి పలుకుతామని ఆన్ రికార్డ్ వచ్చి చెప్పాలని ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. పశ్చిమబెంగాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దాటదన్న తృణమూల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కూడా ఘాటుగా స్పందించింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేశంలో ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి బీజేపీ పరోక్షంగా ఎద్దేవా చేసింది. కాగా పీకే కూడా దీనికి సమాధానంగా ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ దాటితే ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. మొత్తానికి బెంగాల్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు.