ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కావాల్సినంత సఖ్యతగానే మెలుగుతోంది. అయితే ఇది మరింత చేరువ కావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే రోజుకో పరిణామం జరుగుతూనే ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంతో జగన్ సర్కార్ కలిసిమెలిసి ముందుకు వెళుతోంది. అయితే దీన్ని బలపరిచేందుకు ఎన్డీయే పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీయేకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. శివసేన, అకాలీదళ్, ఎల్జేపీ టాటా చెప్పేశాయి. ఎల్జేపీ ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పినా బీజేపీకి మద్దతు ఇస్తామని.. ఆ పార్టీతోనే కలిసి పనిచేస్తామని చెబుతోంది. అయితే ఈ పరిణామాలన్నీ బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి మంచి మెజార్టీనే ఉంది. అయితే మిత్రపక్షాలు మాత్రం దూరమవుతూనే ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు అందరి మద్దతు చాలా అవసరం అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండొచ్చు. అందుకే వెళ్లేవాళ్లు వెళ్లినా వచ్చే వారి కోసం దారులు తెరవాలని అనుకుంటున్నారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వంలో కలుపుకుంటేనే మేలని అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒకటికి రెండు సార్లు చర్చించి వైసీపీని ఎన్డీయేలో భాగస్వామ్యం చేసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
అందుకే సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీతో జరిగే సమావేశంలో ఇది కీ పాయింట్గా చర్చకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం దీనిపై అంత సానుకూలంగా లేరని టాక్. ఇప్పుడు ఎలాగైతే మద్దతు ఇస్తున్నారో ఇదే విధానాన్ని కంటిన్యూ చేయాలని ఆయన భావిస్తున్నారంట. మరి ఈ డిస్కషన్ పై క్లారిటీ మాత్రం రాలేదు.