కరోనా మహమ్మారి దేశంలో ఇంకా విజృంభిస్తూనే ఉంది. కరోనా సోకిన ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనాతో పోరాడుతూ మృతిచెందారు.
కరోనా వైరస్తో మరో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూసిన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరికి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు.
కిరణ్ మహేశ్వరి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్ పూర్ కు తీసుకురానున్నారు. మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎంపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అనంతరం వీళ్లంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇతర వ్యాధులు కూడా తోడవ్వడం వల్ల చనిపోయారు.