బీహార్లో ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (54) కన్ను మూశారు. అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.
అయితే జూన్లో వినోద్ కుమార్తో పాటు ఆయన భార్యకూ కరోనా సోకింది. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ అయినప్పటికీ అనారోగ్య సమస్యతో మళ్లీ హాస్పిటల్లో చేరారు. కాగా రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇది సోమవారం నాటికి ప్రాణాల మీదకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తుది శ్వాస విడిచారు. అయితే కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈయన మృతి చెందడం పార్టీకి దెబ్బ అని అంటున్నారు.
అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్థానమైన ప్రాన్పూర్ నుంచి ఆయన భార్య నిషా సింగ్ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాగా 29 ఏళ్ల వయస్సులోనే ఆయన ప్రాన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015 ఆర్జేడీ-జేడీయూ కూటమిని తట్టుకుని సైతం వినోద్ కుమార్ అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. కాగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన గెలుపు తథ్యమనే ప్రచారం సాగింది. దీంతో బీజేపీకి బలమైన నేత కూడా మిస్ అయినట్లు చర్చించుకుంటున్నారు. కాగా ఈయన తరుపున భార్య బరిలోకి దిగుతారన్న వార్తలు జోరందుకున్నాయి.