ఎన్నికలొచ్చాయంటే చాలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తామని చెబుతూ ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు దేశంలో ఎన్నికల హడావిడి ఎక్కువైంది. బీహార్ ఎలక్షన్స్లో నేతలు బిజీ అయిపోయారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతవరణం వేడెక్కింది. రాజకీయ పార్టీలు తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించేశాయి. ఇందులో భాగంగానే బీజేపీ కూడా ముందువరుసలో ఉంది. బీజేపీ ఆరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమరేంద్ర ప్రతాప్ ఒటర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం మొదలు పెట్టిన ఈయన.. అందరి కాళ్లు మొక్కుతూ ప్రచారం చేస్తున్నారు. కింద పడుకొని నమస్కారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్థున్నారు.
ఈయన వినూత్న ప్రచారం చూస్తున్న వారంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. కాగా ఈయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రతాప్. అయితే 2015 ఎన్నికల్లో అదిష్టానం భోజ్పూర్ టికెట్ కేటాయించింది. అక్కడ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాగా ఈ ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానం అతనికి దక్కింది. దీంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. మరి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన ఈ అభ్యర్థిని ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి.