బుల్లితెర వినోదాల హరివిల్లు బిగ్బాస్4 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత సీజన్ల అనుభవాలు జోడించి ఈ సారి సీజన్లో కొత్త హంగులతో షోను నడిపించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకున్నారని వార్తలొస్తున్నాయి.
ఈసారి బిగ్బాస్ 4కి నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆయన మేకప్ వేసుకుంటున్న ఫోటోలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే మొదటి నుంచి తెలిసినట్లుగానే ఎవ్వరి పేర్లు పక్కాగా తెలియదు. కానీ దాదాపుగా మొత్తం పార్టిసిపెంట్స్ ఖరారయ్యారని తెలుస్తోంది. అయితే మూడు సీజన్ లలో చూసిన బిగ్బాస్కి ఈ ఏడాది చూడబోయే బిగ్బాస్కి చాలా తేడాలుంటాయని తెలుస్తోంది.
భిన్నంగా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకు చాలా మంది పేర్లు లీకయ్యాయి. వీరిలో గాయని మంగ్లీ, బుల్లితెర నటి సమీరా, ఆర్టిస్ట్ సురేఖా వాణి, జానీ మాస్టర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా అనధికారికంగా తెలిసినదే. వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే డైరెక్టుగా షో మొదలవ్వాల్సిందే.
సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ 4 వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటికే షోలో పాల్గొనే వారంతా క్వారంటైన్కి వెళ్లారని సమాచారం. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో వీరందరికీ కరోనా టెస్టులు చేసి నెగిటివ్ వచ్చాకే షోలోకి అనుమతిస్తారు. ఈ యేడాది బిగ్బాస్ నిబంధనలు కఠినతరం చేసింది. మరి బిగ్బాస్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.