ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్న సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య నెలకొన్న వివాదం కారణంగా చైనా మొబైల్ కంపెనీ వివో ఐపిఎల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగింది.
అయితే వివో లేని స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారన్న ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే బరిలో బైజూస్, జియో, అమేజాన్, కోకాకోలా ఉన్నాయి. తాజాగా వీటితో పోటీ పడేందుకు పతంజలి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఐపిఎల్ ప్రధాన స్సాన్సర్గా ఉన్న సమయంలో వీవో బీసీసీఐకి సంవత్సరానికి రూ. 440 కోట్లు చెల్లించేది. మరి ఇప్పుడు ముందుకొస్తున్న సంస్థలు అంత పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదు. బీసీసీఐ మాత్రం కనీసం రూ. 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు స్పాన్సర్షిప్ రావాలని చూస్తోంది.
ఐపిఎల్తో స్పాన్సర్షిప్ కోసం ప్రధానంగా బైజూస్, జియో, అమేజాన్, కోకా కోలా సంస్థలు పోటీ పడుతున్నాయి. జియోకు ఈ స్పాన్సర్షిప్ అమౌంట్ అంత ఇబ్బందేమీ కాదు. ఇక బైజూస్ భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని అంతా అనుకుంటుండగా ఇప్పుడు పతంజలి పేరు వినిపిస్తోంది.
పతంజలి సంస్థకు యోగా గురువు రాందేవ్ బాబా అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపిఎల్ ద్వారా తమ బ్రాండ్లను విదేశాల్లో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుర్వేద ఆధారిత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేయాలని ఆ సంస్థ ఎప్పటినుంచో భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్కు స్పాన్పర్గా ఉండాలని ట్రై చేస్తోంది. మరి ఏ సంస్థ ఐపిఎల్ స్పాన్సర్ షిప్ దక్కించుకుంటుందో చూద్దాం.