దశాబ్దాల కల నెరవేరే రోజొచ్చింది. కోట్లాదిమంది కన్నుల పండుగ కళ్లముందుకొచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బృహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైంది.
రామజన్మభూమి.. అయోధ్యలో రామాలయ నిర్మాణం. అవును దీని గురించే మనం ఇంతవరకు చెప్పుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతి హింధూవు అనుకుంటున్న మాట. ఏ ఇద్దరు కలిసినా గుర్తొచ్చి చెప్పుకునే పురాతన సంభాషణ ఇదే అంటే కచ్చితంగా కాదని చెప్పలేం. ఎందుకంటే ఆ శ్రీరాముడు మనకు ప్రత్యక్ష్యంగా కనిపించకపోయినా.. ఆయన గుర్తొచ్చిన ప్రతిక్షణం మనలో ఏదో తెలియని వెలితి ఉండేది. అదే అయోధ్యలో రామాలయ నిర్మాణం.
ఎట్టకేలకు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అవ్వడంతో ఇప్పుడు సంబరాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామ ఆలయం నిర్మాణం ప్రారంభంకానుంది. ఈమేరకు ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. భూమి పూజకు మూడు రోజుల ముందునుంచే వేదోక్తంగా కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు భూమిపూజ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులు అతి తక్కువ సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మోడీ 40 కేజీల బరువైన వెండి ఇటుకను పవిత్ర స్థలంలో ఉంచుతారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు.