ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. ప్రధానికి లేఖ రాస్తే ఇటు రాష్ట్ర హోమంత్రి, డిజిపి స్పందిస్తున్నారన్నారు. వీరి వైఖరి విచిత్రంగా కనిపిస్తోందన్నారు. దళిత యువకుడు శిరోమండనం కేసులో రాష్ట్రపతి స్పందించినట్లుగానే.. ప్రధాని కూడా ఈ లేఖపై స్పందిస్తారన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. టిడిపి నేతల ఫోన్ సంభాషణలు బయటకు చేరుతున్నాయని గ్రహించే ప్రధానికి లేఖ రాశామన్నారు. చంద్రబాబు గతంలో ఎన్ని లేఖలు రాసినా స్పందించని వారు ఇప్పుడు స్పందిస్తున్నారన్నారు. భూకబ్జాలు, ధౌర్జన్యాలు చూసి విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.