కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాత్కాలిక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఇక ఈ పదవిలో ఉండలేనని తేల్చి చెప్పారు. మరి రాహుల్ గాంధీ తనకు బాధ్యతలు వద్దని చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సారధి సందిగ్దంలో ఉంది.
నేడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ బాధ్యతలు ఎవరికివ్వాలో మీరే తేల్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకించారు. ఇక రాహుల్ సైతం తాను బాధ్యతలు తీసుకోలేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటిలో అధ్యక్షుని విషయం తేలదన్నట్లు స్పష్టమవుతోంది.
సుధీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతల వ్యవహారంలో తలనొప్పులు రావడం ఇప్పుడేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి సందర్బాలు వచ్చాయి. అయితే అప్పట్లో సోనియానే సారథ్యం వహించి పార్టీని ముందుకు నడిపించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక 2014, 2019లో వరుస ఓటములు రావడంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే పలువురు ప్రియాంకా గాంధీ పేరును ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబ సభ్యులే ఉండాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. పలువురు సీనియర్లు మాత్రం కొత్త వారికి ఎంపిక చేస్తే బాగుంటుందని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ప్లీనరి సాధ్యం కాని నేపథ్యంలో తాత్కాలికంగా సోనియానే కొనసాగాలని తీర్మానం చేసే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ భవితవ్యం ఏమవుతుందో చూడాలి..