రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు తిరుగనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మధ్య జరిగిన చర్చలను బట్టి మరి కొద్ది రోజుల్లోనే బస్ సర్వీసులు తిరుగుతాయని తెలుస్తోంది.
అన్లాక్ కొనసాగుతున్న తరుణంలో మరి కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను పూర్త స్థాయిలో ఎత్తి వేస్తారన్న జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటివరకున్న ఆంక్షలన్నీ ఎత్తివేస్తారని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్ సర్వీసులు కూడా తిరుగుతాయి. అయితే లాక్డౌన్ నుంచి మూత పడిన బస్ సర్వీసులు పలు చోట్ల తిరుగుతున్నాయి. అయితే అంతరాష్ట్ర సర్వీసులు మాత్రం ఇప్పటివరకు తిరగలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య బస్ సర్వీసులు నడిపేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని బస్ భవన్లో ఈ సమావేశం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల ప్రాతిపదికన అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడపాలని రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్లోని బస్ భవన్లో సమావేశమైన అధికారులు అంతరాష్ట్ర ఒప్పందంలో చేర్చాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు.
అంతరాష్ట్ర ఒప్పందానికి సంబంధించి తెలంగాణ అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఏపీ నుంచి తెలంగాణకు ప్రతిపాదిత బస్ సర్వీసుల వివరాలు ఇచ్చారు. చర్చల్లో అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. ఈ వారంలో మరోసారి సమావేశం అవ్వాలని ఇరు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మళ్లీ జరిగే సమావేశంలో అంతరాష్ట్ర ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.