ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నారు. ఆయన్ను ఎక్కడ దాచారో చంద్రబాబు చెప్పాలని అంబటి అన్నారు.
డాక్టర్ రమేష్ కుమార్ విచారణకు సహకరించాలన్నారు. మూడు రాజధానుల అంశంపై మాట్లాడిన ఆయన పరిపాలనా వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారన్నారు. ఇక ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. ఇక రామకృష్ణది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా.. లేక క్యాప్టలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా అన్నారు.
ఇక అమరావతి ఉద్యమం గురించి అంబటి మాట్లాడుతూ అక్కడ ఉద్యమమే లేదన్నారు. చంద్రబాబునాయుడు రాజధాని కోసం పోరాటం చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారన్నారు. అమరావతి అనేది పెద్ద స్కాం అన్నారాయన. దళితులకు ఇచ్చిన భూములను టిడిపి నేతలు బలవంతంగా లాక్కున్నారన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణ చేశారన్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు.