గత కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ‘మీ టూ’ పేరుతో ఓ పెద్ద ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వాలంటే శారీరక కోరికలు తీర్చమని అడిగారని చాలామంది సోషల్ మీడియా వేదికగా నినదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ జాబితాలో వినిపించిన పేర్లలో
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ పేరు ఒకటి. తాజాగా మోడల్ పౌలా కూడా సాజిద్పై ఆరోపణలు చేసింది. `హౌస్ఫుల్` సినిమాలో పాత్ర కోసం వెళ్లినపుడు సాజిద్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది.
ఇంతకీ పౌలా చేసిన ఆరోపణలేంటంటే…’మీ టూ ఉద్యమం ప్రారంభమైనపుడు సాజిద్ ఖాన్పై చాలా మంది ఆరోపణలు చేశారు. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కుటుంబం కోసం సంపాదించాల్సిన అవసరం ఉండడంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇప్పుడు నా పేరెంట్స్ నాతో లేరు. అందుకే ధైర్యంగా చెబుతున్నా. నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాజిద్ నన్ను లైంగికంగా వేధించాడు. నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. తన ముందు బట్టలు విప్పమని ఒకసారి నన్ను అడిగాడు. అతను ఎంతమంది అమ్మాయిలతో అలా ప్రవర్తించాడో దేవుడికే తెలుసు. ఇలాంటి నీచులు జైల్లో ఉండాలి. ఆయన నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడమే నేను చేసిన తప్ప`ని పౌలా సంచలన ఆరోపణలు చేసింది.