తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ఫోకస్ పెట్టిందని ప్రచారం సాగుతోంది. ఆయన్ను స్థానికంగా ఢీకొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడును టార్గెట్ చేశారంటూ పొలిటికల్ డిస్కషన్ మొదలైంది.
వై.ఎస్ జగన్ హవా రాష్ట్రంలో ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల టిడిపి గెలిచింది. ప్రధానంగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే అచ్చెన్నాయుడు అప్పట్లో కూడా వైసీపీపై గట్టిగానే మాట్లాడేవారు. దీంతో 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడును ఓడించాలన్న ఆలోచన కూడా వైసీపీకి ఉంది. కానీ అచ్చెన్నాయుడుపై వైసీపీ గెలవలేకపోయింది. తీరా అధికారం చేపట్టిన వైసీపీ ఇప్పుడు అచ్చెన్నను టార్గెట్ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అచ్చెన్నాయుడు హవాను నియోజకవర్గంలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో అచ్చెన్నను ఎవరు కలుస్తున్నారు. అధికారుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందన్న విషయాలు గమనిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా టిడిపి జీరో అయ్యేందుకు ఏమేం చేయాలో అన్ని చేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్కు టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో స్థానికంగా ఏం జరిగినా ఈయనకు తెలియాలన్నట్లు వ్యవహరిస్తున్నారంట.
ఇక ఇప్పటికే అచ్చెన్న ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ క్యాష్ చేసుకొని నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేయాలని నేతలు అనుకుంటున్నారని టాక్. ఈ విషయాలన్నీ పలువురు కావాలనే మాట్లాడుతున్నారని.. వైసీపీ దొంగచాటు పనులు ఎప్పటికీ చెయ్యదని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ అభివృద్ధి చూసి అందరూ ఆయనకు మద్దతు తెలుపుతారంటున్నారు. మరి జిల్లాలో అచ్చెన్నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో చూడాలి.